Google:జీమెయిల్‌ భద్రతపై గూగుల్‌

Google : తాజాగా జీమెయిల్‌ (Gmail) భద్రతపై స్పష్టత ఇచ్చింది. ఇటీవల సోషల్‌ మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో “2.5 బిలియన్‌ జీమెయిల్‌ యూజర్లు అత్యవసరంగా పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని గూగుల్‌ హెచ్చరిక ఇచ్చింది” అనే వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీనిపై స్పందించిన గూగుల్‌ ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖండించింది. జీమెయిల్‌కు అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఉందని, వినియోగదారుల ఇన్‌బాక్స్‌లు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది.

గూగుల్‌ బ్లాగ్‌ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం, జీమెయిల్‌ అకౌంట్లపై ఎటువంటి పెద్ద స్థాయి భద్రతా ఉల్లంఘన జరగలేదని చెప్పింది. “మా యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీమెయిల్‌ డేటా బలమైన రక్షణ కింద ఉంటుంది. బయటకు వచ్చిన కొన్ని వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. మేము ఎలాంటి ఎమర్జెన్సీ వార్నింగ్‌ ఇవ్వలేదు” అని గూగుల్‌ స్పష్టం చేసింది.

కొద్ది రోజులుగా షైనీ హంటర్స్‌ (Shiny Hunters) అనే హ్యాకర్‌ గ్రూప్‌ గూగుల్‌ సిస్టమ్‌లోకి చొరబడటానికి ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. అంతేకాక, గూగుల్‌ సేల్స్‌ఫోర్స్‌ డేటాబేస్‌లోకి దాడి జరిగిందన్న వదంతులు కూడా వ్యాపించాయి. ఈ అంశాలపై గూగుల్‌ స్పందిస్తూ, “హ్యాకర్లు ప్రయత్నాలు చేసినా, మా రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంది. వినియోగదారుల డేటా సురక్షితంగానే ఉంది. పాస్‌వర్డ్‌లు ఎక్కడా లీక్‌ కాలేదు” అని వివరించింది.

అలాగే, ప్రతి రోజూ వచ్చే మాల్వేర్‌, ఫిషింగ్‌ దాడులను 99.9 శాతం వరకు అడ్డుకుంటున్నామని గూగుల్‌ తెలిపింది. యూజర్ల డేటా భద్రత కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పింది. అయితే మరింత రక్షణ కోసం యూజర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టడం, పాస్‌కీలు (Passkeys) వాడటం, రెండు దశల భద్రతా వ్యవస్థ (Two-step verification) ఉపయోగించడం వల్ల అకౌంట్లు మరింత సురక్షితంగా ఉంటాయని గూగుల్‌ సూచించింది.

అంతేకాకుండా, అనుమానాస్పదమైన ఇమెయిల్స్‌ను క్లిక్‌ చేయకూడదని, తెలియని లింకులను ఓపెన్‌ చేయరాదని హెచ్చరించింది. ఈ విధంగా గూగుల్‌ జీమెయిల్‌ యూజర్లకు భరోసా ఇస్తూ, తప్పుడు వార్తలను ఖండించింది. మొత్తంగా, జీమెయిల్‌ అకౌంట్లు సురక్షితంగానే ఉన్నాయని, యూజర్లు సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.